
- చిన్న కొడుకుతో కలిసి ఎర్రవల్లి ఫాంహౌస్కు..
- ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుండడంతో తాత ఆశీర్వాదం
- కొడుకును కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్తున్న కవిత..వచ్చే నెల 1న రాక
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లారు. కవిత చిన్న కొడుకు ఆర్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుండడంతో.. తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం ఫాంహౌస్కు చేరుకున్నారు. కవిత కొడుకు ఆర్య తన తాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కవిత ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేశారు. కాగా, కుమారుడిని అమెరికాలో కాలేజీలో చేర్పించేందుకు కవిత శనివారం అమెరికాకు బయల్దేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 1న తిరిగి రానున్నారు.
రాజీ లేదు.. చర్చే లేదు..
కవిత తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్తో చర్చిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. అందుకు తగ్గట్టుగా కేటీఆర్, హరీశ్రావు, వినోద్కుమార్ను కూడా కేసీఆర్ ఫాంహౌస్కు పిలిపించుకున్నారనే వార్తలు వచ్చాయి. కాగా, కవిత ఫాంహౌస్ నుంచి వెళ్లేపోయే ముందు హరీశ్రావు, వినోద్కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఇక, కవిత హైదరాబాద్కు పయనమై సగం దూరం వచ్చాక కేటీఆర్.. హైదరాబాద్ నుంచి బయల్దేరి ఫాంహౌస్కు వెళ్లారని సమాచారం.
ఈ క్రమంలోనే కేసీఆర్, కవిత మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వెళ్లిపోయాక కేటీఆర్, హరీశ్రావు, వినోద్కుమార్తో భేటీ అయిన కేసీఆర్.. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టుపై చర్చించినట్టు తెలిసింది. కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సమాచారం. కమిషన్ రిపోర్టులో కేసీఆర్, హరీశ్రావునే హైలైట్ చేసిన నేపథ్యంలో.. న్యాయపరంగా సవాల్ చేసే కోణాల్లోనూ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. అందులో భాగంగానే కమిషన్ ఇచ్చిన ఫుల్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఇటీవల సర్కారుకు హరీశ్రావు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.